DIGITAL MANCHERIAL NEWS:- బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా ప్రధాన రహదారిపై BRS పార్టీ ఆధ్వర్యంలో కళ్ళకు నల్లగంతలు కట్టుకుని నిరసన తెలిపిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అమలుకాని మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం వినోద్ నేటికీ సుమారు 31 నెలలు గడిచినప్పటికీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని తెలిపారు.
గత BRS ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 100 కోట్ల రూపాయల నిధులను ప్రొసీడింగ్లను మార్చి వాటితోనే అరకొర పనులు చేశారు తప్ప కొత్తగా చేసిందేమీ లేదని తెలిపారు. వారు చేసింది కేవలం నియోజకవర్గంలో మండలానికొక సామంత ఎమ్మెల్యేను పెట్టుకుని ప్రభుత్వ భూములను ఎక్కడికక్కడ కబ్జాలు మాత్రం రోజూ చేస్తున్నారని, ఇటీవల గత BRS ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించిన భూములను కూడా కబ్జా చేశారని తెలిపారు. అంతే కాకుండా అన్ని పనుల్లో కమీషన్లు తీసుకోవడమే కాకుండా నియోజకవర్గ ప్రజలను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.
బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు ఎక్కడికక్కడ గుంతలు పడి తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న, గత BRS ప్రభుత్వంలో సుమారు 350 ఎకరాల్లో ఏర్పాటు చేయదలచిన ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ నేటికీ ప్రారంభం అవకున్నా, బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో తగినంత వైద్యులు, సిబ్బంది లేక నియోజకవర్గ ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా, బెల్లంపల్లి పట్టణంలో మిగిలిన సింగరేణి ఇండ్లకు శాశ్వత ఇండ్ల పట్టాలు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు గోసపడుతున్నా, ఇలా చెప్పుకుంటూపోతే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి హైదరాబాద్ లో, విదేశాల్లో జల్సాలు చేస్తున్న గడ్డం వినోద్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రానున్నకాలంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిస్తామని, అప్పటికీ మార్పు రాకుంటే నియోజకవర్గ ప్రజల కోసం నిరాహారదీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


